రాజకీయ పార్టీలకు సుప్రీం కీలక ఆదేశాలు

అభ్యర్థుల నేర చరిత్రను తమ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చెయ్యాల్సిందే

supreme court
supreme court

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు అన్ని రాజకీయ పార్టీలకు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసున్న అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటే ఆ వివరాలను బయటపెట్టాల్సిందేనంటూ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ప్రతి రాజకీయ పార్టీ వారి అధికారక వెబ్ సైట్లతో పాటు, సోషల్ మీడియాలో నేర చరిత్ర కలిగిన నాయకుల పూర్తి వివరాలను అప్ లోడ్ చేయాలని ఆదేశించింది. అంతేకాదు, నేర చరిత్ర కలిగిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎందుకు కల్పించారో కూడా పేర్కొనాలని ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థికి టికెట్ ఇచ్చిన 48 గంటలల్లోగానే ఈ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని… వార్తాపత్రికల్లో కూడా ప్రచురించాలని ఆదేశించింది. 72 గంటల్లోపల అభ్యర్థి క్రిమినల్ కేసుల వివరాలను ఈసీకి అందించాలని చెప్పింది.

ఎన్నికలలో ఏ వ్యక్తినైనా ఎన్నుకోవడం అనే ప్రక్రియ కేవలం ఆ వ్యక్తి గొప్ప లక్షణాాల ఆధారంగానే జరగాలని… పలానా వ్యక్తి అయితేనే గెలుస్తాడు అనే ధోరణితో జరగరాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నేర చరిత్ర ఓటర్లకు తెలవాలని… వారికి ఓటు వేయాలో, వద్దో ఓటర్లే నిర్ణయించుకుంటారని చెప్పింది. గెలవడం ఒక్కటే రాజకీయ పార్టీల లక్ష్యం కారాదని సూచించింది.

సీరియస్ క్రైమ్స్ లో ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడానికి, పార్టీలలో కీలక బాధ్యతలను చేపట్టకుండా చూసేందుకు చట్టాలను మార్చాలంటూ 2018 సెప్టెంబర్ లో ఐదుగురు సభ్యులతో కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే సుప్రీంకోర్టు సూచనలను కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం పట్టించుకోలేదంటూ బిజెపి నేత, లాయర్ అశ్విని ఉపాధ్యాయ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా… అభ్యర్థుల నేర చరిత్రను ప్రచురించినంత మాత్రాన ఎలాంటి ప్రభావం ఉండదని… క్రిమినల్ కేసులు ఉన్నవారికి టికెట్లు ఇవ్వబోమని రాజకీయ పార్టీలు ప్రకటించడం వల్ల ఉపయోగం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నేపథ్యంలో సుప్రీకోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/