పసిడి సాధించిన అచింత షూలి..ప్రధాని మోడి ప్రశంసలు

ఇప్పుడు వెళ్లి హ్యాపీగా సినిమా చూసుకో..ప్రధాని మోడి

Delighted Sheuli won gold at CWG, he worked very hard for special achievement: PM Modi

న్యూఢిల్లీః కామన్వెల్త్ గేమ్స్-2022 లో భారత వెయిట్ లిఫ్టర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది . ఇప్పటికే రెండు రోజుల్లో ఐదు పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టర్లు మరో పతకాన్ని భారత్ ఖాతాలో చేర్చారు. తాజాగా పురుషుల 73 కేజీల ఫైనల్లో అచింత షూలి పసిడి సాధించాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగిసిన ఈ పోటీలో ఆరంభం నుంచి స్థిరంగా బరువులు ఎత్తిన 20 ఏళ్ల ఈ బెంగాల్‌ లిఫ్టర్‌ ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురైనా వారిని వెనక్కి నెట్టి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. బంగారు పతకాన్ని సాధించిన అచింతను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కంగ్రాట్స్​ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ‘అనుకున్నది సాధించావుగా.. ఇప్పుడు వెళ్లి హ్యాపీగా సినిమా చూసుకో’ అంటూ ట్వీట్​ చేశారు మోడీ.

కామన్వెల్త్​ క్రీడలకు ముందు ఆటగాళ్లతో మోడీ వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. ఆ సమయంలో అచింతతో జరిగిన సంభాషణను మోదీ గుర్తుచేసుకున్నారు. “కామన్వెల్త్ గేమ్స్‌కు ఆటగాళ్ల బృందంతో మాట్లాడాను. ఆ సమయంలో అచింతతో కూడా సంభాషించాను. అతడికి తన తల్లి, సోదరుడు ఇచ్చిన మద్దతు గురించి చర్చించాము. అతడికి సినిమాలు ఇష్టమని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అచింతకు సమయం దొరికింది. సినిమాలు చూసుకోవచ్చు” అని మోడీ ట్వీట్​ చేశారు.

కాగా, పతకం గెలుచుకున్న అనంతరం అచింత మీడియాతో మాట్లాడాడు. “నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎన్నో పోరాటాలను అధిగమించి ఈ పతకాన్ని సాధించాను. ఈ బంగారు పతకాన్ని నా సోదరుడితో పాటు కోచ్‌లకు అంకితం చేస్తాను. ఇక నా టార్గెట్​ ఒలింపిక్స్. అందుకు ప్రాక్టీస్​ మొదలుపెడతాను” అని అచింత చెప్పాడు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/