ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి అరుదైన ఘనత
దేశంలోనే తొలి పూర్తిస్థాయి హైడ్రో, సోలార్ పవర్ ఎయిర్పోర్ట్ గా ఢిల్లీ విమానాశ్రయం
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అరుదైన ఘనత దక్కించుకుంది. దేశంలో తొలి పూర్తిస్థాయి హైడ్రో, సోలార్ పవర్ ఎయిర్ పోర్టుగా గుర్తింపు దక్కించుకుంది. ఈ విమానాశ్రయం గతేడాది దేశంలోనే కాకుండా మధ్య ఆసియాలోకెల్లా ఉత్తమ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది.
కాగా, ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో గత కొంతకాలంగా అన్ని కార్యకలాపాలు హైడ్రో, సోలార్ శక్తితోనే నడుస్తున్నాయి. తాజా ఘనతపై ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ స్పందించింది. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన శక్తి సహితంగా, పూర్తిస్థాయి కర్బన ఉద్గార రహిత విమానాశ్రయంగా మార్చాలన్న లక్ష్యంలో ఇది కీలక ముందడుగు అని అభివర్ణించింది. రెండు లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించింది. ఇందిరాగాంధీ విమానాశ్రయానికి హైడ్రో ఎలక్ట్రిసిటీ సరఫరా చేసేందుకు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం 2036 వరకు అమల్లో ఉంటుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/