వైఎస్‌ఆర్‌సిపికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

వైఎస్‌ఆర్‌సిపితో పాటు ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు

Delhi High Court
Delhi High Court

న్యూఢిల్లీ : ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ అనే పేరును ఉపయోగించే హక్కు తమకే ఉందంటూ ‘అన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ వైఎస్‌ఆర్‌సిపితో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’ పేరుతో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిందని, తమదే నిజమైన ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ అని మహబూబ్ బాషా కోర్టుకు తెలిపారు. ‘వైఎస్‌ఆర్’ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టరైన పార్టీ ‘అన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్’ ఒక్కటేనని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సిపి తమ పార్టీ పేరును అక్రమంగా ఉపయోగిస్తోందంటూ ఆయన ఆరోపించారు. జగన్ అధ్యక్షుడిగా వున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు సెప్టెంబరు 3 లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని వైఎస్‌ఆర్‌సిపి తో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/