బాణాసంచా తయారీ, అమ్మకం, వినియోగంపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం
న్యూఢిల్లీః ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ఆప్ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం మదిరిగానే ఈ సారి కూడా దీపావళి పర్వదినం సమయంలో టపాసులపై పూర్తి నిషేధం విధించింది. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు బ్యాన్ అమలులో ఉంటుందని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్రాయ్ బుధవారం ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచా తయారీ, అమ్మకం, వినియోగంపై నిషేధం అమలులో ఉంటుందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆన్లైన్ బాణాసంచా విక్రయాలకు సైతం నిషేధం వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.
చలికాలం వచ్చిందంటే చాలు దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పెరిగుతున్న విషయం తెలిసిందే. చలి కారణంగా పొగమంచు, వాహనాల నుంచి వచ్చే పొగకు తోడు పలు రాష్ట్రాల్లో వ్యవసాయ పొలాల్లో వ్యర్థాలను దహనం చేస్తుండడంతో ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్నది. ఫలితంగా జనం శ్వాస తీసుకునేందుకు సైతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. ఢిల్లీలో దీపావళి పటాకులపై ప్రభుత్వం నిషేధించడం ఇది మూడోసారి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/