గృహ నిర్బంధంలో సిఎం కేజ్రీవాల్
నిన్న సాయంత్రం నుంచి ఆయన నివాసంలోకి ఎవరికీ అనుమతి లేదన్న ఆప్
న్యూఢిల్లీ: రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ నేపథ్యంలో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. సింఘూ బోర్డర్ వద్ద ఆందోళన చేపడుతున్న రైతుల్ని సోమవారం రోజున సిఎం కేజ్రీవాల్ పరామర్శించారు. ఈ నేపథ్యంలో బిజెపి పార్టీ.. సిఎం కేజ్రీని హౌజ్ అరెస్టు చేసినట్లు ఆప్ తన ట్విట్టర్లో ఆరోపించింది. సిఎం ఇంట్లోకి వెళ్లేందుకు కానీ, బయటకు వచ్చేందుకు కానీ ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదని ఆమ్ ఆద్మీ పేర్కొన్నది. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతుల్ని కలిసిన కేజ్రీవాల్.. వారికి మద్దతు ప్రకటించారు.
సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రైతుల్ని కలిసేందుకు వచ్చినట్లు ఆయన చెప్పారు. రైతుల డిమాండ్లకు మద్దతు ఇస్తున్నామని, వారి డిమాండ్లు వాస్తవమైనవని, ముందు నుంచి తమ పార్టీ కానీ, తాను కానీ రైతుల పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఆందోళన చేస్తున్న రైతుల్ని అరెస్టు చేసేందుకు స్టేడియాలను జైళ్లుగా మార్చాలని ఢిల్లీ పోలీసులు తనపై వత్తిడి తెచ్చారని, కానీ వారి ఎటువంటి అనుమతి ఇవ్వలేదని నిన్న కేజ్రీ తెలిపారు. రైతులను క్షణం నుంచి సిఎం ఢిల్లీ పోలీసులు హౌజ్ అరెస్టు చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. సిఎం కేజ్రీ హౌజ్ అరెస్టుపై నార్త్ ఢిల్లీ డీసీపీ ఆంటో ఆల్ఫోన్స్ స్పందించారు. కేజ్రీవాల్ను గృహనిర్బంధం చేసినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/