ఫిలిప్పీన్స్​లో భారీ వర్షాలతో వరదల బీభత్సం ..43మంది మృతి

ఫిలిప్పీన్స్​: ఫిలిప్పీన్స్​లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉష్ణమండల అల్పపీడనం వల్ల దక్షిణ ఫిలిప్పీన్స్​లో గతకొద్దిరోజులుగా భారీ వర్షాలు కురిశాయి. కొండచరియలు విరిగిపడటం సహా వివిధ ఘటనల్లో సుమారు 43 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మంది ఆచూకీ గల్లంతైందని అధికారులు తెలిపారు. లెయిటే రాష్ట్రంలోని బేబే నగరం వరదలతో అతలాకుతలమవుతోంది. గత శుక్రవారం నుంచి ఇక్కడ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వందమందికి పైగా ప్రజలకు తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

రోడ్లపై బురద, మట్టిదిబ్బలు పేరుకుపోవడం వల్ల పోలీసులు, ఆర్మీ దళాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి. బేబే గ్రామాల్లో 36 మృతదేహాలను గుర్తించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. సమర్, నెగ్రోస్ ఓరియెంటల్ ప్రాంతాల్లో పలువురు గల్లంతయ్యారని చెప్పారు. సహాయక చర్యల కోసం అధునాతన యంత్రాలను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. కోస్ట్ గార్డ్ సైతం రంగంలోకి దిగింది. అగ్నిమాపక దళాలు, పోలీసులతో కలిసి కొంతమంది గ్రామస్థులను కాపాడినట్లు కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. వరదల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. అత్యవసర నిధుల మంజూరుకు ఆటంకం కలగకుండా ఉండేందుకు స్థానిక మేయర్ మైఖెల్ రమా.. వాతావరణ అత్యయిక స్థితిని ప్రకటించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/