బూస్టర్ డోస్ ప్రయోగాలకు డీసీజీఐ అనుమతి

దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాల్లో ప్రయోగాలు
కొవిషీల్డ్, కొవాగ్జిన్ తీసుకున్న వారి ఎంపిక


న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఇంట్రా నాసల్ వ్యాక్సిన్ ను.. బూస్టర్ డోస్ గా పరీక్షించి చూసేందుకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాల్లో నాసికా టీకాపై పరీక్షలు నిర్వహించనున్నారు. కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న వారికి ఇంట్రా నాసల్ టీకాను (చుక్కల రూపంలో) బూస్టర్ డోస్ గా ఇవ్వొచ్చని భారత్ బయోటెక్ చెబుతోంది. దీంతో విస్తృత స్థాయిలో ప్రయోగాలకు డీసీజీఐ నుంచి అనుమతి సంపాదించింది. మార్చి నెల నాటికి ఇంట్రా నాసల్ వ్యాక్సిన్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు భారత్ బయోటెక్ అంచనా వేస్తోంది.

5,000 మంది ఆరోగ్యవంతులైన వలంటీర్లపై భారత్ బయోటెక్ ఈ టీకాను ప్రయోగించి చూడనుంది. ఇందులో 2,500 మంది చొప్పున రెండు గ్రూపులు ఉంటాయి. ఒక గ్రూపు కొవిషీల్డ్ తీసుకున్న వారు కాగా, మరో గ్రూపు కొవాగ్జిన్ తీసుకున్నవారు. రెండో డోసు తీసుకుని ఆరు నెలలు అయిన వారిపై ప్రయోగించి చూడనుంది. ప్రయోగాల అనంతరం ఫలితాల నివేదికను డీసీజీఐ ముందు దాఖలు చేయాలి. అప్పుడు అత్యవసర అనుమతి లభించేందుకు అవకాశం ఉంటుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/