ప్రధాని డిగ్రీ సర్టిఫికేట్ పై మరోసారి స్పందించిన కేజ్రీవాల్

గుజరాత్ కోర్టు తీర్పు తర్వాత పలు సందేహాలు వస్తున్నాయన్న ఢిల్లీ సీఎం

Day After Being Fined By Court, Arvind Kejriwal Again Asks For PM’s Degree

న్యూఢిల్లీః ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలకు సంబంధించిన వివాదంపై ఆరోపణలు చేశారు. గుజరాత్ కోర్టు తీర్పు ప్రజలకు కొత్త సందేహాలకు తావిచ్చేలా ఉందని అన్నారు. డిగ్రీ సర్టిఫికేట్ అడిగితే ఉలుకెందుకని ప్రశ్నించారు. మోడీ డిగ్రీ సర్టిఫికేట్ నకిలీవేమోననే అనుమానం కలుగుతోందని, ఈ అనుమానానికి కారణం కోర్టు తీర్పేనని చెప్పారు. దీంతోపాటు మరెన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని వివరించారు.

ప్రధాని మోడీ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికేట్ వివరాల కోసం కేజ్రీవాల్ గతంలో కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) కి లేఖ రాశారు. ఆర్టీఐ చట్టం ప్రకారం మోడీ విద్యార్హతల వివరాలు వెల్లడించాలని కోరారు. దీంతో అప్పటి సీఐసీ ఎం.శ్రీధర్ ఆచార్యులు.. ఈ వివరాలు వెల్లడించాలని గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై గుజరాత్ వర్సిటీ కోర్టుకెక్కింది. తాజాగా విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు.. ప్రధాని డిగ్రీలను చూపనక్కర్లేదంటూ తీర్పు వెలువరించింది. అంతేకాదు, ఈ పిటిషన్ దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ కేజ్రీవాల్ కు రూ.25 వేల జరిమానా విధించింది.