శిరిడీ భక్తులకు ఇబ్బంది లేదు..దర్శనాలు కొనసాగుతాయి

గ్రామస్తులు ప్రకటించిన బంద్‌తోనూ ట్రస్ట్‌కు సంబంధం లేదన్న ట్రస్ట్

SAI BABA , SHIRDI
SAI BABA , SHIRDI

శిరిడీ: శిరిడీ సాయిబాబా జన్మ స్థలమని పేరున్న మహారాష్ట్రలోని పర్భణీ జిల్లాలోని పథ్రీని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన చెప్పడంతో బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం, శిరిడీ గ్రామస్తులు బంద్‌కు పిలుపునివ్వడంతో ఆ ఆలయం మూసివేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై శిరిడీ సంస్థాన్ బోర్డు స‌భ్యులు మీడియాతో మాట్లాడుతూ స్పష్టతనిచ్చారు. శిరిడీ ప్ర‌జ‌లు కేవ‌లం నిర‌స‌న చేప‌డుతున్న‌ట్లు, ప‌ట్ట‌ణ బంద్‌ను మాత్రమే పాటించ‌నున్నామ‌ని చెప్పారు. అంతేగానీ, ఆల‌యాన్ని మూసివేయ‌డం లేద‌ని స్పష్టం చేశారు. ఆల‌యాన్ని తెరిచే ఉంచుతామని, గదుల సౌక‌ర్యం, ప్ర‌సాద విత‌ర‌ణ అన్నీ ఎప్పటిలాగే జ‌రుగుతాయని సంస్థాన్ బోర్డు తెలిపారు. ప్రభుత్వ ప్రకటనకు నిరసనగా షిర్డీ ఆలయం మూసివేస్తున్నారన్న వార్తలు అవాస్తవమని ఆలయ ట్రస్ట్‌ స్పష్టం చేసింది. గ్రామస్తులు ప్రకటించిన బంద్‌తోనూ ట్రస్ట్‌కు సంబంధం లేదని తెలిపింది. భక్తులు ఆందోళనకు గురికావద్దని చెప్పింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/