పవన్ కళ్యాణ్ కు వైసీపీ నేత సపోర్ట్
టెన్త్ ఫలితాలు వైస్సార్సీపీ సర్కార్ ను ఇరకాటంలో పడేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తీర్ణత శాతం తక్కువ అవ్వడం పట్ల ప్రతిపక్ష పార్టీలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తున్నారు. ఇదే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఉత్తీర్ణులు కాని విద్యార్థులందరికీ గ్రేస్ మార్కులు కలపాలని డిమాండ్ చేయగా..ఆ డిమాండ్స్ కు వైస్సార్సీపీ నేత దాడి వీరభద్రరావు సపోర్ట్ గా నిలిచారు.
పవన్కల్యాణ్ డిమాండ్ చేసినట్లుగానే ఉత్తీర్ణులు కాని విద్యార్థులందరికీ గ్రేస్ మార్కులు కలపాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన అధ్యక్షుడు, ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాల్లో పదోతరగతిలో 83 శాతంకన్నా తక్కువ ఫలితాలు ఏనాడూ రాలేదని, ఇప్పుడు 67.26 శాతమే ఉత్తీర్ణత ఉండటమనేది ఒక అధ్యాపకుడిగా చాలా బాధకలిగిస్తోందన్నారు. పరీక్ష ఎలా ఉంటుంది? దానికి సంబంధించిన మోడల్ పేపర్ ను కూడా ప్రభుత్వం విడుదల చేయలేదని, ఉత్తీర్థత శాతం తగ్గడానికి ఇది కూడా ఒక కారణమని విశ్లేషించారు.
కాగా కొంతకాలంగా పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కడంలేదని దాడి తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం సాగుతున్న వేళ..ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా పదోతరగతి ఫలితాలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో రాజకీయంగా చర్చ కు దారిసింది.