అరేబియా సముద్రంలో బలపడిన నిసర్గ
మరో 6 గంటల్లో తుపానుగా మారే అవకాశం
ముంబయి: అరేబియా సముద్రంలో నిసర్గా తుఫాన్ బలపడింది. దీంతో గుజరాత్, మహారాష్ట్ర తీరాల వద్ద వర్షం కురుస్తోంది. సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. మరో 6 గంటల్లో ఇది తుపానుగా మారుతుందని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. తుపానుగా ఏర్పడితే దీన్ని నిసర్గ అనే పేరుతో వ్యవహరిస్తారు. ఇది రేపు ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ వద్ద తీరం చేరుతుందని అంచనా వేస్తున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. తుపాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 105 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ముఖ్యంగా, ముంబయి మహానగరంపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/