ముంబయిపై దూసుకొస్తున్న ‘నిసర్గ’
మరో రెండు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నసిఎం
ముంబయి: ముంబయి నగరంపై అత్యంత తీవ్ర తుపాను ‘నిసర్గ’ రూపంలో దూసుకువస్తున్నది. మరోపక్క, తుపాను తీరం దాటక ముందే ముంబయి భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే కరోనా కేసులు పెరిగిపోయి, ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్న వేళ, తుపాను వారిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇప్పటికే ముంబయి తీర ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నిషేధించిన మహారాష్ట్ర ప్రభుత్వం, ఎమర్జెన్సీ టీమ్ లను రంగంలోకి దించింది. ముంబయి తీర ప్రాంతాల్లో 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అరేబియా సముద్రపు అలలు సుమారు 6 అడుగుల ఎత్తుతో ఎగసి పడుతున్నాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, మరింత వర్షం కురిసే అవకాశాలు ఉండటంతో అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు ప్రారంభించారు.
ప్రజలు ఇళ్లలోనే ఉండాలని మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాకరే కోరారు. ‘నిసర్గ’ ప్రభావం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని, మరో రెండు రోజుల పాటు ప్రజలు పూర్తి అప్రమత్తతతో ఉండాల్సిందేనని ఆయన తెలిపారు. సైక్లోన్ నిసర్గ మరింత బలపడినట్లు ఇవాళ ఐఎండీ పేర్కొన్నది. వాయు వేగం కూడా పెరిగినట్లు అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 110 కిలోమీటర్ల చొప్పున బలమైన ఈదురుగాలులు వీస్తున్నట్లు ఐఎండీ పేర్కొన్నది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/