మండూస్‌ తుఫాను.. తమిళనాడులోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

Cyclone Mandous: 3 Tamil Nadu districts on red alert as storm maintains severe intensity

చెన్నైః బంగాళాఖాతంలో ఏర్పడిన మండూస్‌ తుఫాను ఈరోజు తెల్లవారుజామున తీవ్ర తుఫాన్‌గా రూపు మార్చుకుని తీరం వైపు దూసుకొస్తున్నది. దాంతో భారత వాతావరణ కేంద్రం అధికారులు తమిళనాడులోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు. ఉత్తర తమిళనాడు తీరంలోని చెంగల్పట్టు, విల్లుపురం, కాంచీపురం జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉన్నందున రెడ్‌ అలర్ట్‌ జారీచేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి వాయవ్య బంగాళాఖాతం వైపు కదులుతున్న మండూస్‌ తుఫాను.. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరంలో తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. తమిళనాడు ఉత్తర తీరంతోపాటు, పక్కనే ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతంలో పుదుచ్చేరి, శ్రీహరికోటకు మధ్య, మహాబలిపురం చుట్టుపక్కల 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

మండూస్‌ తుఫాను నేపథ్యంలో గ్రేటర్ చెన్నై కార్పోరేషన్ అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. నగరంలోని పార్కులను, ప్లే గ్రౌండ్‌లను మూసివేయించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు పార్కులను, ప్లే గ్రౌండ్‌లను తెరువద్దని ఆదేశించారు. పైగా మండూస్‌ తుఫాను నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై గ్రేటర్ చెన్నై కార్పోరేషన్ కమిషనర్‌ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/