హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్

అవినీతి నిరోధకశాఖ డీజీగా అంజనీకుమార్ బదిలీ

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఐపీఎస్ బదిలీలు చేపట్టింది. మొత్తంగా 30 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ గత రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న అంజనీకుమార్‌ను అవినీతి నిరోధకశాఖ డీజీగా బదిలీ చేసింది. ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన సీవీ ఆనంద్‌ను ఆయన స్థానంలో హైదరాబాద్ సీపీగా నియమించింది. సిద్దిపేట, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు, 11 జిల్లాల ఎస్పీలను బదిలీ చేయగా, నారాయణపేట ఎస్పీ చేతనకు ఎలాంటి పోస్టు కేటాయించలేదు. అంతేకాదు, ఒకటి రెండు రోజుల్లో మరిన్ని బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ స్థాయిలో బదిలీలు చేపట్టడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి.

ఇక హైదరాబాద్ కొత్త సీపీగా నియమితులైన సీవీ ఆనంద్ ఏప్రిల్ 2018లో కేంద్ర సర్వీసులకు వెళ్లి మూడున్నర నెలల కిందట తిరిగి తెలంగాణ కేడర్‌కు బదిలీపై వచ్చారు. ఇప్పుడాయనకు హైదరాబాద్ సీపీగా కీలక బాధ్యతలు అప్పగించారు. సుదీర్ఘకాలంగా రాచకొండ కమిషనర్‌గా ఉన్న మహేశ్ భగవత్‌ను మాత్రం అక్కడే ఉంచారు. అలాగే, డీసీపీలుగా ఉంటూ పనిచేస్తున్న చోటే డీఐజీలుగా పదోన్నతులు పొంది కొనసాగుతున్న ఏఆర్ శ్రీనివాస్, ఏవీ రంగనాథ్, కార్తికేయ, అవినాశ్ మహంతికి చాలా కాలం తర్వాత కొత్త పదవులు దక్కాయి. నాన్ కేడర్ ఎస్పీలుగా ఉంటూ మూడు రోజుల కిందట ఐపీఎస్‌లుగా పదోన్నతులు పొందిన కోటిరెడ్డి, కేఆర్ నాగరాజ్, ఉదయ్ కుమార్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, మనోహర్, శిల్పవల్లి వంటి అధికారులకు కీలక పోస్టులు లభించాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/