ఐఎస్‌బీ విద్యార్థుల‌పై నిఘా..ఈ చ‌ర్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నాను

హైద‌రాబాద్ లో ఈ నెల 26న ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవం
ముఖ్య అతిథిగా పాల్గొన‌నున్న‌ ప్రధాని మోడీ
సోషల్‌ మీడియాలో ప్రధానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తే వారిపై నిఘా పెట్టార‌న్న నారాయ‌ణ‌

హైదరాబాద్: హైద‌రాబాద్ లో ఈ నెల 26న ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవం, స్నాతకోత్సవానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేప‌థ్యంలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) విద్యార్థుల‌పై నిఘా పెట్టార‌ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.విద్యార్థులు సోషల్‌ మీడియాలో ప్రధానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తే అలాంటి వారిపై నిఘా ఉంచి, వార్షికోత్సవానికి రాకుండా అడ్డుకోవ‌డానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

ఇటువంటి చ‌ర్య‌లు దుర్మార్గమ‌ని ఆయ‌న అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో పౌరుల‌కు వారి భావాలు వ్యక్తపరిచే హక్కు ఉంటుంద‌ని, దాన్ని అణ‌చివేయాల‌నుకోవ‌డం స‌రికాద‌ని మండిప‌డ్డారు. నియంతృత్వ ధోరణి బిజినెస్‌ స్కూల్లో ప్రారంభిస్తే అందులో చదివే విద్యార్థులు సమాజానికి ఉపయోగపడేవారు అవుతారా? లేక నియంతల్లాగా త‌యారు అవుతారా? అని ఆయ‌న నిల‌దీశారు. కేంద్ర ప్ర‌భుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని ఆయ‌న అన్నారు. వెంటనే నిఘాను ఎత్తివేయాల‌ని ఆయ‌న అన్నారు. విద్యార్థులందరూ వార్షికోత్సవంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే మోడీ క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని నారాయ‌ణ వ్యాఖ్యానించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/