పాకిస్థాన్‌లో క‌రోనా కొత్త వేరియంట్ కలకలం

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో క‌రోనా వైర‌స్‌ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. . ఆ స్ట్రెయిన్‌కు చెందిన కేసులు అధిక సంఖ్య‌లో న‌మోదు అవుతున్న‌ట్లు ఆ దేశ ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. కోవిడ్‌19కు చెందిన ఎప్సిలాన్ వేరియంట్ చాలా దూకుడుగా వ్యాప్తి చెందుతున్న‌ట్లు సైంటిఫిక్ టాస్క్ ఫోర్స్ స‌భ్యుడు డాక్ట‌ర్ జావెద్ అక్ర‌మ్ తెలిపారు. ఈ వేరియంట్ తొలుత కాలిఫోర్నియాలో క‌నిపించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. దీన్ని కాలిఫోర్నియా స్ట్రెయిన్ లేదా B.1.429గా పిలుస్తున్న‌ట్లు డాక్ట‌ర్ అక్ర‌మ్ తెలిపారు. కాలిఫోర్నియా నుంచి ఈ వేరియంట్ యూకే, యురోపియ‌న్ దేశాల్లో వ్యాప్తి చెందింది. ఇప్పుడు పాకిస్థాన్‌లో ఆ వేరియంట్‌కు చెందిన కేసులు అధిక సంఖ్య‌లో న‌మోదు అవుతున్న‌ట్లు సైంటిఫిక్‌ టాస్క్ ఫోర్స్ చెప్పింది.

ఎప్సిలాన్‌కు చెందిన అయిదు వేరియంట్ల‌తో పాటు ఏడు మ్యుటేష‌న్ల కేసులను గుర్తించిన‌ట్లు డాక్ట‌ర్ అక్ర‌మ్ వెల్ల‌డించారు. ఎప్సిలాన్ వేరియంట్ వ‌ల్లే పాక్‌లో మ‌ళ్లీ ఇన్‌ఫెక్ష‌న్ల సంఖ్య పెరుగుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. వైర‌స్‌ను నియంత్రించాం కానీ, పూర్తిగా రూపుమాప‌లేక‌పోయిన‌ట్లు ఆయ‌న తెలిపారు. పాకిస్థాన్‌లో సుమారు 40 ఎప్సిలాన్ వైర‌స్ కేసులు న‌మోదు అయిన‌ట్లు జీన్ సీక్వెన్సింగ్ ద్వారా గుర్తించామ‌న్నారు. అయితే ప్ర‌తి పేషెంట్‌కు జీన్ సీక్వెన్సింగ్ చేయ‌లేమ‌ని, అందువ‌ల్ల కేసులు ఎక్కువే ఉండి ఉంటాయ‌న్నారు. కానీ అన్ని ర‌కాల కోవిడ్ టీకాలు ఎప్సిలాన్ వేరియంట్‌పై స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ప్ర‌జ‌లంద‌రూ వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని ఆయ‌న కోరారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/