తెలంగాణలో ‘కొవాగ్జిన్’ క్లినికల్ ట్రయల్స్ మొదలు
ఐసీఎంఆర్ వర్గాల వెల్లడి
హైదరాబాద్: భారత్ బయోటెక్ అభివృద్ధిచేసిన కరోనా వ్యాక్సిన్ ‘కొవాగ్జిన్’ క్లినికల్ ట్రయల్స్ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపికచేసిన 12 కేంద్రాల్లో మనుషులపై ఆ టీకాను ప్రయోగించనున్నట్టు ఐసీఎంఆర్ వర్గాలు తెలిపాయి. ఇందులో హైదరాబాద్లోని నిమ్స్, విశాఖపట్నంలోని కేజీహెచ్ దవాఖానలు ఉన్నాయి. మొత్తంగా వెయ్యి మందిపై టీకా ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఐసీఎంఆర్ వర్గాలు వెల్లడించాయి. మొదటిదశలో 250 మందిపై వ్యాక్సిన్ను ప్రయోగించనున్నారు. అనంతరం రెండోదశ ప్రయోగాల్లో 750 మందికి టీకా వేస్తారు. రెండు దశల్లో వచ్చిన ఫలితాలను విశ్లేషిస్తారు. వైరస్ను ఎదుర్కొనే ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతున్నాయా? వాటి సామర్థ్యం ఎంత? దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయా?.. తదితర భిన్న కోణాల్లో లోతుగా విశ్లేషిస్తారు. ఫలితాల ఆధారంగా వ్యాక్సిన్ విడుదలపై స్పష్టత రానున్నది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/