మాజీ ప్రధాన మంత్రి దేవె గౌడకు షాక్‌

రూ. 2 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని బెంగళూరు సిటీ సివిల్‌ కోర్టు తీర్పు

బెంగళూరు : మాజీ ప్రధాన మంత్రి దేవె గౌడకు బెంగళూరు సిటీ సివిల్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు షాక్‌ ఇచ్చింది. పరువు నష్టం కేసులో నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కారిడార్‌ ఎంటర్‌ప్రైజ్‌ (నైస్‌) లిమిటెడ్‌కు రూ.2కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2011, జూన్‌లో కన్నడ వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవెగౌడ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ సంస్థ తమ పరువుకు భంగం వాటిల్లిందంటూ పరువు నష్టం దావా వేసింది. దీనిపై విచారణ జరిపిన సివిల్ కోర్టు న్యాయమూర్తి మల్లన గౌడ రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని ఆదేశించారు. దేవేగౌడ చేసిన ఆరోపణలు సరికాదని కంపెనీ తరపు న్యాయవాది వాదించారు.

ఇదే కేసులో గతంలో ట్రయిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి చెందిన దేవెగౌడ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిపై రూ.10కోట్ల నష్ట పరిహారం కోరుతూ నైస్ దాఖలు చేసిన పిటిషన్​ను స్వీకరించిన ధర్మాసనం.. విచారణ జరిపింది. ఈ క్రమంలో దేవగౌడ తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడంలో విఫలం కావడంతో న్యాయస్థానం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/