మైసూర్పాక్తో కరోనా తగ్గుతుందని ప్రచారం
స్వీట్ షాపును సీల్ చేసిన అధికారులు

కోయంబత్తూరు: తన దుకాణంలోని మైసూర్పాక్ తింటే కరోనా నయవుతుందని ప్రకటించిన వ్యక్తి నిర్వహించే స్వీట్ దుకాణానికి అధికారులు సీల్ వేశారు.తమిళనాడు, కోయంబత్తూరులోని తొట్టిపాళెయంలో జరిగిందీ ఘటన. ఇక్కడి తిరునెల్వేలి లాలా స్వీట్ షాపు నిర్వాహకుడు తమ దుకాణంలో తయారు చేసే మైసూరు పాక్లో ఔషధ గుణాలు ఉన్నాయని, దానిని తింటే ఒక్క రోజులోనే కరోనా మటాష్ అయిపోతుందని ప్రచారం చేస్తూ మూడు నెలలుగా ప్రకటనలిస్తున్నాడు. తన తాత నేర్పించిన సిద్ధ వైద్యం నిబంధనల ప్రకారం ఔషధ మైసూరు పాక్ను తయారు చేస్తున్నట్టు పేర్కొన్నాడు. దీనిని తింటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి కరోనా తగ్గిపోతుందని చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. విషయం తెలిసిన ఆహార, ఆరోగ్యశాఖ, వైద్యాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలా చేయడం తప్పని చెప్పి దుకాణానికి సీల్ వేశారు. దుకాణం నుంచి 120 కిలోల మైసూరు పాక్ను స్వాధీనం చేసుకున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/