దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్
వ్యాక్సిన్ పంపిణీ కోసం చర్యలు ముమ్మరం
New Delhi: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ముందు శుక్రవారం మరోసారి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం డ్రై రన్ నిర్వహిస్తోంది. 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ డ్రై రన్ జరగనుంది. ఇందు కోసం ఆయా ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేపట్టాయి.
డ్రై రన్పై గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశమై మార్గనిర్దేశం చేశారు . దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం చర్యలు ముమ్మరం చేసింది . టీకా పంపిణీలో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసేందుకు ఇప్పటికే ఓసారి డ్రై రన్ నిర్వహించగా.. శుక్రవారం మరోమారు దేశవ్యాప్తంగా టీకా డ్రై రన్ నిర్వహిస్తోంది.
ఉత్తర్ప్రదేశ్, హరియాణా రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ డ్రై రన్ జరగనుంది. ఇందు కోసం ఆయా ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.
736 జిల్లాల్లో…
దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 736 జిల్లాల్లో ఈ డ్రై రన్ చేపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నెల 2న తొలివిడత డ్రై రన్లో మొత్తం 125 జిల్లాలలో నిర్వహించారు.
ప్రత్యేక దృష్టి పెట్టాలి..
దేశవ్యాప్తంగా రెండో దఫా వ్యాక్సిన్ మాక్ డ్రిల్ నేపథ్యంలో గురువారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, అదనపు చీఫ్ సెక్రటరీలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. టీకా డ్రై రన్ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని, వ్యక్తిగతంగా రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
కొవిడ్-19 వ్యాక్సిన్ భద్రత, సామర్థ్యంపై పుకార్లు, తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/