భారత్ కు పాకిన కరోనా స్ట్రెయిన్?!
బ్రిటన్ నుంచి వచ్చిన దాదాపు పది మంది కరోనా పాజిటివ్
New Delhi: బ్రిటన్ ను వణికిస్తున్న కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ భారత్ కూ పాకిందా? ఇప్పటికే బ్రిటన్ ను దాదాపుగా కమ్మేసిన ఈ కొత్తరకం కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
యూరోప్ దేశాలతో పాటు ఈజిప్టుకూ పాకిన ఈ మహమ్మారి భారత్ లో కూడా జొరబడిందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ బ్రిటన్ పై ట్రావెల్ బ్యాన్ విధించిన రోజుల తరువాత భారత్ తీరిగ్గా బ్రిటన్ కు విమానాల రాకపోకలను నిషేధించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి బ్రిటన్ కు విమాన రాకపోకలను భారత్ రద్దు చేసింది.
ఇప్పటికే బ్రిటన్ నుంచి వచ్చిన దాదాపు పది మంది కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. కోల్ కతా విమానాశ్రయంలో ఐదుగురు, కేరళలో ఇద్దరు, చెన్నైలో ఒకరు, కర్నాటకలో ఒకరు కరోనా పాజిటివ్ గా విమానాశ్రయాల్లో నిర్వహించిన పరీక్షల్లో నిర్ధారణ అయ్యారు.
వీరంతా కూడా బ్రిటన్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. అయితే వీరికి సోకింది కొత్తరకం కరోనా వైరాస్సా కాదా అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రస్తుతం వీరందరినీ క్వారంటైన్ లో ఉంచి, పరీక్ష ఫలితాల కోసం పూణె ల్యాబ్ కు నమూనాలు పంపించారు.
కానీ ఈ ఒకటి రెండు రోజులు కాదు, బ్రిటన్ లో సెప్టెంబర్ నుంచి నమోదౌతున్న కరోనా కేసులలో అత్యధికం కొత్తరకం కరోనా కేసులేనని చెబుతున్నారు.
దీంతో అంచనా వేస్తున్న దాని కంటే అధికంగానే ఈ కొత్త స్ట్రైయిన్ ప్రపంచంలో పాకి పోయి ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/