తప్పుడు విధానాలతో ప్రపంచ దేశాలు వెళ్తున్నాయి
అందుకే కేసులు పెరుగుతున్నాయి..డబ్ల్యూహెచ్వో
జెనీవా : డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తాజాగా జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ… ప్రపంచ దేశాలు అనుసరించాల్సిన సరైన చర్యలను అమలు చేయట్లేదని, అందుకే కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ఆయా దేశాల అధినేతల నుంచి వస్తున్న మిశ్రమ సందేశాలు ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేటట్లు చేస్తున్నాయని చెప్పారు. ప్రజలకు కరోనా నంబర్ వన్ శత్రువుగానే ఉందన్నారు. అయితే, దాన్ని ఎదుర్కోవడంలో ప్రజల చర్యలు ఆ స్థాయిలో లేవని తెలిపారు. భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులను ధరించడం లాంటి అంశాలను ప్రజలు, ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవాలని సూచించారు. జాగ్రత్తలు తీసుకోకపోతే సమీప భవిష్యత్తులోనూ సాధారణ పరిస్థితులు నెలకొనడం సాధ్యం కాదని హెచ్చరించారు. పరిస్థితులు మరింత క్లిష్టతరంగా మారే అవకాశం ఉందని చెప్పారు. కాగా కరోనాను అదుపు చేయలేకపోవడమే కాకుండా తప్పుడు విధానాలతో ప్రపంచ దేశాలు వెళ్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాగైతే కరోనా మరింత భీకరంగా మారే ప్రమాదముందని తెలిపింది.
తాజా కరోనా లాక్ డౌన్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/corona-lock-down-updates/