కరోనాపై తొలి వ్యాక్సిన్ వచ్చింది..పుతిన్
అధికారిక ప్రకటన చేసిన పుతిన్
రష్యా: కరోనా వ్యాక్సిన్ పై రష్యా కీలక ప్రకటన చేసింది. రష్యా నుంచి కరోనా వైరస్కు తొలి వ్యాక్సిన్ వచ్చిందని, ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాక్సిన్పై అధికారికంగా ప్రకటన చేశారు. తన కుమార్తెకు టీకా వేయించినట్లు పుతిన్ ప్రకటన చేశారు. ఈ టీకా ద్వారా రోగనిరోధకత పెరిగి కరోనా నియంత్రణలోకి వస్తుందని చెప్పారు. మొదట వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, చిన్నారులకు వ్యాక్సిన్ వేయనున్నట్లు వివరించారు. కరోనా వ్యాక్సిన్ను రిజిస్టర్ చేసిన తొలి దేశంగా రష్యా నిలిచింది. కరోనా వ్యాక్సిన్ను ఈ రోజు ఉదయమే రిజిస్టర్ చేసినట్లు రష్యా అధికారులు ప్రకటించారు. వ్యాక్సిన్ను రిజిస్టర్ చేయించిన తొలి దేశం తమదేనని భావిస్తున్నట్లు చెప్పారు.
కాగా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత తన కూతురి శరీరంలో స్వల్పలంగా ఉష్ణోగ్రతలు పెరిగినట్లు అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. కానీ త్వరగానే తన కూతురు సాధారణ స్థాయికి వచ్చిట్లు తెలిపారు. టీకా ప్రయోగంలో భాగంగా తన కూతురు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. తొలిసారి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత తన కూతురి టెంపరేచర్ 38గా నమోదు అయ్యిందని, తర్వాత రోజు టెంపరేచర్ 37కు పడిపోయినట్లు రష్యా అధ్యక్షుడు తెలిపారు. సెప్టెంబర్ నుంచి ఆ టీకాను హెల్త్ వర్కర్లకు తొలుత ఇవ్వనున్నట్లు రష్యా డిప్యూటీ ప్రధాని తత్యానా గొలికోవా తెలిపారు. జనవరి నుంచి సాధారణ ప్రజలకు ఆ టీకా అందుబాటులో ఉంటుందన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/