ఒక్క డోస్ ఇచ్చినా బలమైన రోగనిరోధక శక్తి

మిగతా వ్యాక్సిన్ల కన్నా మెరుగ్గా పనిచేస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్

johnson-and-johnson-vaccine

న్యూయార్క్: కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసేందుకు ఎన్నో కంపెనీలు ప్రయత్నిస్తుండగా, జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన వ్యాక్సిన్, మధ్యంతర ఫలితాలు విడుదల అయ్యాయి. ‘ఏడీ 26. సీఓవీ2.ఎస్’ పేరిట తయారైన ఈ వ్యాక్సిన్ మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే, బలమైన రోగనిరోధక శక్తిని శరీరానికి అందిస్తోందని తెలుస్తోంది. రెండు డోస్ ల స్థానంలో ఒక్క డోస్ ఇచ్చినా, సరిపోతుందని ట్రయల్స్ నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇదే సమయంలో మోడెర్నా ఐఎన్సీ, పిఫైజర్ ఐఎన్సీ వ్యాక్సిన్లు రెండు డోస్ లు తీసుకుంటే కలిగే ప్రయోజనం, జాన్సన్ అండ్ జాన్సన్ ఒక్క వ్యాక్సిన్ తోనే లభిస్తోందని తెలుస్తోంది.

అయితే, ఈ వ్యాక్సిన్ ను ఇంతవరకూ వయో వృద్ధులకు ఇచ్చి పరిశీలించారా?అన్న విషయమై స్పష్టత ఇంకా రాలేదు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధులే కరోనా వ్యాక్సిన్ కు అధికంగా ప్రభావితమై, ప్రాణాలు కోల్పోతున్నారన్న సంగతి తెలిసిందే. కాగా, జాన్సన్ అండ్ జాన్సన్ కు అమెరికా పూర్తి మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ సింగిల్ డోస్ కోతులను కరోనా నుంచి రక్షించడంలో పూర్తి విజయవంతం కాగా, తొలి దశలో 1000 మంది ఆరోగ్య వంతులపై ప్రయోగించారు. ప్రస్తుతం విడుదలైన వ్యాక్సిన్ ఫలితాలు సంతృప్తికరంగా ఉండటంతో, తుది దశలో 60 వేల మందిపై ట్రయల్స్ నిర్వహించేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ సిద్ధమైంది. ఈ మేరకు దరఖాస్తు చేశామని, రెగ్యులేటరీ అప్రూవల్ రాగానే ట్రయల్స్ మొదలవుతాయని, వచ్చే సంవత్సరం తొలినాళ్లకు వ్యాక్సిన్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సంస్థ ప్రతినిధులు వ్యాఖ్యానించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/