ఇప్పట్లో కరోనా ముగిసే సూచనలు లేవు
వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా కృషి జరుగుతోంది.. డబ్ల్యూహెచ్వో
జెనీవా: కరోనా మహమ్మారి పై ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ప్రభావం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదని ఆయన అన్నారు. అంతేగాక, ఈ వైరస్ మరింత విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఇప్పటికీ ఉందని చెప్పారు. దీంతో ప్రజలు దీని బారినపడే అవకాశాలు మరిన్ని ఉన్నాయని తెలిపారు. కరోనా ఉద్ధృతికి అడ్డుకట్టపడాలని కోరుకుంటున్నామని చెప్పారు. కరోనాను అరికట్టడంలో పలు దేశాలు కాస్త పురోగతి సాధించాయని తెలిపారు.
కాగా, వైరస్ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా కృషి జరుగుతోందని డబ్ల్యూహెచ్వో ఎమర్జెన్సీ చీఫ్ మైక్ రేయాన్ తెలిపారు. అయితే, ఇప్పట్లో ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయని చెప్పలేమని, వైరస్ కట్టడి కోసం అది సోకిన వారిని వెంటనే గుర్తించి ఐసోలేట్ చేయడం ద్వారా వ్యాప్తిని అరికట్టడం వంటి చర్యలతో అడ్డుకోవచ్చని చెప్పారు. కరోనా సోకిన వారితో మెలిగిన వారికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. జపాన్, దక్షిణ కొరియా, జర్మనీల్లో ఈ చర్యలు తీసుకుంటుండడంతో ఉద్ధృతి తక్కువగా ఉందన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/