అమెరికాలో మ‌ళ్లీ క‌రోనా పంజా

అమెరికాలో నిండిపోతున్న ఐసీయూ బెడ్స్

మిన్న‌సొట్టా: అమెరికాలో మ‌ళ్లీ క‌రోనా భ‌యం ప‌ట్టుకున్న‌ది. కోవిడ్ సోకిన‌, అనుమానిత రోగులు.. ఐసీయూ బెడ్స్ కోసం ఆప‌సోపాలు ప‌డుతున్నారు. గ‌త ఏడాదితో పోలిస్తే 15 రాష్ట్రాల్లో ఇప్పుడు ఐసీయూ బెడ్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉన్న‌ట్లు ఆరోగ్య‌, మాన‌వ సేవ‌ల శాఖ తెలిపింది. మిన్న‌సొట్టా, కొల‌రాడో, మిచిగ‌న్‌లో 37, 41, 34 శాతం ఐసీయూ బెడ్స్ నిండుకున్నాయి. క‌రోనా పేషెంట్ల‌తో ఆస్పిట‌ళ్లు ఫుల్‌కావ‌డంతో ఇత‌ర వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారి ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగా మారింది. వాషింగ్ట‌న్ యూనివ‌ర్సిటీ హాస్పిట‌ల్‌లో ఫిజిషియ‌న్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు ప్రొఫెస‌ర్ అలీ మోకాదా తెలిపారు. వ్యాక్సినేట్ కానివాళ్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

అమెరికాలో ఇప్ప‌టికీ రోజూ స‌గ‌టును వెయ్యి మంది క‌రోనాతో మ‌ర‌ణిస్తున్నారు. గ‌త మూడు నెల‌ల నుంచి ఇదే సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. మ‌ర‌ణాల సంఖ్య పెరిగిందంటే.. ఇన్‌ఫెక్ష‌న్ పెరిగిన‌ట్లే అని డాక్ట‌ర్లు చెబుతున్నారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ నెమ్మ‌దిగా ఉన్న కార‌ణంగా మ‌ళ్లీ కేసులు పెరుగుతున్న‌ట్లు అనుమానం వ్య‌క్తం అవుతోంది. మిచిగ‌న్‌లో 54 శాతం వ్యాక్సినేట్ అయ్యారు. కొల‌రాడో, మిన్న‌సొట్టాలో జాతీయ స‌గ‌టుకు స‌మానంగా ఉన్నారు. న్యూయార్క్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పాజిటివ్ రేటు 8 శాతం పెరిగింది. సీడీసీ కోవిడ్ నెట్ స‌ర్వియ‌లెన్స్ రిపోర్ట్ ప్ర‌కారం కూడా వ్యాక్సిన్ వేసుకోని వారే ఎక్కువ‌గా ఆస్ప‌త్రి పాల‌వుతున్నారు. న్యూజెర్సీలోనూ ఐసీయూ బెడ్స్ లో చేరుతున్న‌వారి సంఖ్య 24 శాతం పెరిగింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/