మళ్లీ చైనాలో పెరుగుతున్న మహమ్మారి కేసులు

లాంఝౌలో లాక్ డౌన్..గడప దాటి బయటకు రావొద్దని ఆదేశాలు

బీజింగ్ : చైనాలో మరోసారి కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. 40 లక్షల మంది జనాభా ఉన్న లాంఝౌ సిటీలో లాక్ డౌన్ విధించారు. అత్యవసరమైతే తప్ప గడప దాటి బయటకు రావొద్దని జనానికి సిటీ అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కొత్తగా 29 కేసులు నమోదుకాగా.. లాంఝౌలో 6 కేసులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా ఘన్షు ప్రావిన్స్ రాజధాని అయిన లాంఝౌలో లాక్ డౌన్ విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ అమలు కఠినంగా ఉంటుందని, కేవలం నిత్యావసరాలు, వైద్య చికిత్సలకు మాత్రమే బయటకు అనుమతిస్తామని తేల్చి చెప్పారు. ఎవరికి వారు ఇళ్లకే పరిమితం కావాలని స్పష్టం చేశారు. కేసులు పెరుగుతుండడంతో ఇప్పటికే ఆ దేశంలో టూరిస్టులపై ఆంక్షలు విధించారు. వారంలోనే చైనాలో వందకుపైగా కేసులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/