రేవంత్ రెడ్డి కి కరోనా..

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కరోనా బారినపడ్డారు. దీంతో హోమ్ ఐసోలేషన్ లో రేవంత్ రెడ్డి చికిత్స తీసుకుంటున్నారు. కరోనా కారణంగా మునుగోడు పాదయాత్రకు దూరంగా ఉన్నారు. నారాయ‌ణ‌పూర్ నుంచి చౌటుప్ప‌ల్ దాకా సాగ‌నున్న‌ పాద‌యాత్ర వాస్తవానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే మొద‌లు కావాల్సి ఉంది. ఈ మేర‌కు యాత్ర‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధం కాగా.. రేవంత్ రెడ్డి కూడా యాత్ర‌కు పార్టీ నేత‌ల‌ను ఆహ్వానిస్తూ తాను కూడా సిద్ధ‌మైపోయారు. యాత్ర‌కు రాన‌న్న భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి సారీ కూడా చెప్పారు.

ఇలాంటి కీల‌క త‌రుణంలో రేవంత్ రెడ్డి క‌రోనా బారిన ప‌డ్డారు. శ‌నివారం ఉద‌యం రేవంత్ రెడ్డిలో స్వ‌ల్పంగా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. దీంతో త‌న ఇంటిలోనే సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన ఆయన… తాను యాత్ర‌కు రాలేన‌ని, అందుకు గ‌ల కార‌ణాల‌ను వివ‌రిస్తూ పార్టీ నేత‌లు, శ్రేణుల‌కు సందేశం పంపారు. మరోపక్క మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ లో మాటల యుద్ధం పెరుగుతుండడం తో కార్యకర్తల్లో ఆందోళన మొదలవుతుంది. కలిసికట్టుగా ఉండి..ఉప ఎన్నికల్లో పాల్గొనాల్సిన నేతలు ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు , క్షేమపణలు చెప్పుకోవడం ఏంటి అని మాట్లాడుకుంటున్నారు.