విమానంలో కరోనా కలకలం..125 మంది ప్రయాణికులకు కరోనా

ఇటలీ నుంచి అమృత్ సర్ వచ్చిన విమానంలో కరోనా కలకలం

అమృత్ సర్ : దేశంలో కరోనా కేసులు మళ్లీ అమాంతం పెరుగుతున్నాయి. దీంతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కూడా బెంబేలెత్తిస్తోంది. దేశంలో థర్డ్ వేవ్ ప్రారంభమయిందని కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ప్రకటించింది. తాజాగా ఓ విమానంలో కొవిడ్‌ కలకలం సృష్టించింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకున్న ఈ విమానంలో పెద్ద ఎత్తున ప్రయాణికులు కరోనా బారిన పడ్డారు. మొత్తం 175 మంది ప్రయాణికుల్లో ఏకంగా 125 మంది ప్రయాణికులకు కరోనా సోకిందని అమృత్‌ సర్‌ ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్ వీకే సేథ్ వెల్లడించారు. ‘ఇటలీ రాజధాని రోమ్‌ నుంచి ఓ అంతర్జాతీయ విమానం అమృత్‌సర్‌కు వచ్చింది. కరోనా ఆంక్షల్లో భాగంగా ప్రయాణికులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం. అందులో 125మందికి పాజిటివ్‌గా తేలింది ‘ అని డైరెక్టర్ వీకేసేథ్ తెలిపారు. కాగా కరోనా బాధితుల్లో ఎంతమందికి ఒమిక్రాన్‌ సోకిందో ఇంకా తెలియాల్సి ఉంది.
కాగా రోమ్ నుంచి వచ్చిన ఈ విమానం ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ కు చెందిన దని వార్తలు వచ్చాయి. దీనిపై ఎయిర్ ఇండియా స్పష్టత నిచ్చింది. ప్రస్తుతం తాము ఇటలీ నుంచి ఎలాంటి విమానాలు నడపడం లేదని ట్వీట్ పెట్టింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/