కో ఆపరేటివ్ బ్యాంకులకు కొత్త రూల్స్
ఆర్బీఐ చేతికి మరింత కంట్రోల్
న్యూఢిల్లీ: డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కోఆపరేటివ్ బ్యాంక్లను బలోపేతం చేసేందుకు, పీఎంసీ బ్యాంక్ లాంటి కుంభకోణాలను అరికట్టేందుకు.. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్లో సవరణలకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. దేశంలో 1,540 కోఆపరేటివ్ బ్యాంక్లుండగా.. వీటిలో 8.60 కోట్ల మంది డిపాజిటర్లున్నారు. వీరి మొత్తం సేవింగ్స్ రూ.5 లక్షల కోట్లు ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదిత సవరణలు కోఆపరేటివ్ బ్యాంక్స్ కోసం గైడ్లైన్స్ తెచ్చేందుకు ఆర్బీఐకి ఉపయోగపడతాయి. కో ఆపరేటివ్ బ్యాంకుల అడ్మినిస్ట్రేటివ్ సమస్యలను మాత్రం రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ పరిధిలోనే ఉంచుతున్నట్లు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. ఈ సవరణలతో కో ఆపరేటివ్ బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయొచ్చని చెప్పారు. కోఆపరేటివ్ బ్యాంక్లకు సీఈవోల అర్హతను ముందుగానే నిర్ణయించి వీరిని నియమించేటప్పుడు.. ఆర్బీఐ పర్మిషన్ తీసుకునేలా సవరణలు చేశారు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఆడిట్ జరగాల్సి ఉంటుంది. ఏదైనా కోఆపరేటివ్ బ్యాంక్ సమస్యలో ఉంటే.. ఆ బ్యాంక్ బోర్డును ఆర్బీఐ రద్దు చేసే అవకాశం ఉంటుందని ప్రకాశ్ జవదేకర్ చెప్పారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/