తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ..వంట నూనె ధరలు తగ్గించాలని సూచన

pm modi

సామాన్య ప్రజలకు తీపి కబురు అందించింది కేంద్రం. మండిపోతున్న వంట నూనె ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. 8 నెలల క్రితం 90 రూపాయలు ఉన్న వంట నూనె ప్యాకెట్.. ఇప్పుడు 180 రూపాయలు దాటేసింది. దీంతో సామాన్య ప్రజలు నూనె దగ్గరికి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఈ తరుణంలో కేంద్రం ముడి పామాయిల్‌, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు నూనెలపై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని కేంద్రం తొలగించింది. అంతేగాక వీటిపై ఉన్న అగ్రిసెస్‌ను కూడా తగ్గించింది.

క్రూడ్ పామ్ ఆయిల్, క్రూడ్ సోయాబిన్ ఆయిల్, క్రూడ్ సన్ ఫ్లవర్ ఆయిల్ వంటి వటిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 2.5 శాతం నుంచి జీరోకి తగ్గించేసింది. అగ్రి సెస్‌ను కూడా పామ్ ఆయిల్‌కు 20 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించింది. క్రూడ్ సోయాబీన్, క్రూడ్ సన్ ఫ్లవర్ ఆయిల్‌కు దీన్ని 5 శాతానికి తగ్గించింది.

ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసింది. వంట నూనె ధరలు వెంటనే తగ్గేలా చర్యలు తీసుకోవాలని ఇందులో ఉంది. దిగుమతి సుంకాల తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని కోరింది. దీంతో వంట నూనె ధరలు కేజీకి రూ.15 నుంచి 20 వరకు తగ్గొచ్చని తెలుస్తోంది.