పవన్ యాత్ర కు సిద్దమైన స్కార్పియో వాహనాలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ 05 నుండి బస్సు యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ పర్యటన కోసం ఎనిమిది కొత్త స్కార్పియో వాహనాలను తీసుకొచ్చారు. ఎనిమిది నలుపు రంగు స్కార్పియో వాహనాలు ఈరోజు ఆదివారం పార్టీ ఆఫీస్ కు చేరుకున్నాయి. పవన్ పర్యటనకు ఈ వాహనాలను వినియోగించనున్నారు. వీటికి పూజ కార్యక్రమాలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇక అక్టోబర్ 5వ తేదీన తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆరు నెలల పాటు రాష్ట్రమంతా పర్యటించి.. ప్రతీ ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభలో పాల్గొంటారు. దీనికి సంబంధించి షెడ్యూల్ కు తుది రూపు ఇస్తున్నారు. ఇప్పటికే పొత్తుల పైన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో వేడి పెంచిన పవన్ కళ్యాణ్.. తన పర్యటనల ద్వారా పార్టీలో జోష్ పెంచటంతో పాటుగా తన సత్తా చాటేందుకు సిద్దమయ్యారు. 2024లో జరగాల్సిన ఎన్నికలు ఏడాది ముందుగానే 2023 మార్చి – ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయంటూ మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రణాళిక లేని పాలన వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. జగన్ వర్క్ ఫ్రం హోం సీఎం అని, ప్రభుత్వాన్ని నడపడం చేతకాకే చేతులు ఎత్తేశాడని విమర్శించారు. అందుకే వచ్చే మార్చిలో జగన్ ఎన్నికలకు వెళతాడని, దీనిపై తమ వద్ద పక్కా సమాచారం ఉందన్నారు. నిజాయితీకి నిదర్శనంగా ఉండే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని నాదెండ్ల మనోహర్‌ ధీమా వ్యక్తం చేశారు.