ప్రమాదాన్ని పరిశీలిస్తూ లోయలోపడిన కానిస్టేబుల్
కరీంనగర్ సమీపంలోగల మానేరు వంతెన వద్ద జరిగిన ఘటన
కరీంనగర్: ఆదివారం ఉదయం కరీంనగర్ పట్టణానికి సమీపంలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది.అలుగనూరు మానేరు వంతెనపై నుంచి ఓ కారు ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోగా, కారు నడుపుతున్న గడ్డి శ్రీనివాస్ దుర్మరణం పాలయ్యారు. ఇదే ఘటనలో అతని భార్య సునీతకు, మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించే క్రమంలో కొందరు కిందకు దిగి సాయం చేస్తున్న వేళ, బ్రిడ్జిపై నుంచి ఘటనా స్థలిని చూస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్, అదుపుతప్పి అందులో పడిపోయారు. ఈ ఘటన జరగడానికి ముందే ఓ వ్యక్తి దీన్ని వీడియో తీస్తుండటంతో, పై నుంచి కానిస్టేబుల్ పడుతున్న దృశ్యాలు ఇందులో నిక్షిప్తం అయ్యాయి. చంద్రశేఖర్ కరీంనగర్ వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతని పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది.
కాగా ఆదివారం కావడంతో కరీంనగర్ లోని శుభాష్ నగర్ లో నివాసం ఉంటున్న గడ్డి శ్రీనివాస్ ఫ్యామిలీ కొమరవెళ్లి మల్లన్న దర్శనానికి బయలుదేరిన వేళ, ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిని మంత్రి గంగుల కమలాకర్ తో పాటు పోలీసు ఉన్నతాధికారులు సందర్శించారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/