కాంగ్రెస్ విద్యుత్ సౌధ ముట్టడి ఉద్రిక్తత..కార్యకర్తలకు -పోలీసులకు ఘర్షణ

తెలంగాణ లో పెరిగిన కరెంట్ చార్జీలను తగ్గించాలంటూ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ సౌధ ముట్ట‌డికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. విద్యుత్ చార్జీలతో పాటు, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలపై కూడా నిరసన తెలియజేయడానికి పిలుపునిచ్చింది. కేంద్రం పెంచుతూ పోతున్న ధరలకు నిరసనగా సివిల్ సప్లై కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించింది. నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుండి ర్యాలీ చేపట్టి, విద్యుత్ సౌధ ముట్టడించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పార్టీ నాయకులంతా ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని అక్కడి నుండి విద్యుత్ సౌధ ముట్టడికి వెళ్ళవలసి ఉంది. అయితే ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు నిర్వహించారు. అయినప్పటికీ నేతలు పోలీసులను నెట్టేస్తూ..ర్యాలీ లో పాల్గొన్నారు.

మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యుత్ సౌద ముట్టడికి యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, మహిళ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఎంతచెప్పినా వెనక్కి తగ్గకపోవడంతో ఇరువురి మధ్యఘర్షణ జరిగింది. తోపులాటలో మహిళా కాంగ్రెస్ నాయకురాలు విద్యారెడ్డి కిందపడటంతో స్పృహతప్పి పడిపోయారు.ఆమెకు శ్వాస సమస్యలు ఉండటంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది.వెంటనే ఆమెను హుటాహుటిన నిమ్స్ కు తరలించారు.