ఈడీ విచార‌ణ‌కు రాహుల్.. హైద‌రాబాద్‌లో భారీ ఎత్తున ర్యాలీ

ఈడీ తీరును నిర‌సిస్తూ దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ నిర‌స‌న‌లు
హుస్సేన్ సాగ‌ర్ మీదుగా టీపీసీసీ ర్యాలీ

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచారిస్తున్న అంశాన్ని నిర‌సిస్తూ..ఆయా రాష్ట్రాల్లోని ఈడీ కార్యాల‌యాల ఎదుట పార్టీ శ్రేణులు శాంతియుతంగా ఆందోళ‌న చేప‌డుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో టీపీసీసీ చేప‌ట్టిన నిర‌స‌న‌కు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు హాజ‌ర‌య్యారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ఈ ర్యాలీలో భాగంగా పార్టీ శ్రేణులు భారీ ర్యాలీని నిర్వ‌హించాయి. ఈ ర్యాలీ హుసేన్ సాగ‌ర్ మీదుగా సాగ‌గా… హుస్సేన్ సాగ‌ర్ మొత్తం కాంగ్రెస్ శ్రేణుల‌తో నిండిపోయింది. అక్క‌డ ఓ జ‌న‌సంద్ర‌మే క‌నిపించింది. ఇదే అంశాన్ని ప్ర‌స్తావిస్తూ రేవంత్ రెడ్డి…ర్యాలీ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ దానికి సాగ‌ర తీరాన జ‌న వాహిని… ప్ర‌తిధ్వ‌ని అంటూ ఓ కామెంట్ జ‌త చేశారు. అంతేకాకుండా స‌త్య‌మేవ జ‌య‌తే అన్న క్యాప్ష‌న్‌ను కూడా త‌న ట్వీట్‌కు ఆయ‌న జ‌త చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/