ఈ నెల 13 న ఈడీ ప్రధాన కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతల ధర్నా
ఈ నెల 13 న ఢిల్లీ లోని ఈడీ ప్రధాన కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ నెల 13న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) విచారించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ఎంపిలు, నేతలు ధర్నాకు పిలుపునిచ్చారు. సోమవారం విచారణ సమయంలో న్యూఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టబోతున్నారు. మోడీ సర్కార్ రాజకీయంగా కక్ష కట్టి.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్పై తప్పుడు కేసులు బనాయిస్తుందని, దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కార్యాలయాల్లోనూ సత్యాగ్రహ నిర్వహించాలని గురువారం కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కెసివేణుగోపాల్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తున్న ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా చర్యలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని ఎంపిలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులంతా ఇడి కార్యాలయానికి ర్యాలీ చేపడతామని వేణుగోపాల్ తెలిపారు. ప్రస్తుతం సోనియా కరోనా తో బాధపడుతుంది. వాస్తవానికి ఈ నెల 8 నే ఈడీ ముందు హాజరుకావాలి కానీ కరోనా నుండి ఇంకా బయటపడకపోవడం తో 13 న హాజరవుతానని తెలిపింది. దీంతో సోమవారం ఈడీ ఎదుట సోనియా హాజరుకానున్నారు.