సిఎం కెసిఆర్, కెటిఆర్పై ధ్వజమెత్తిన కోమటిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కెటిఆర్పై కాంగ్రెస్ ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కెసిఆర్, కెటిఆర్ హీనంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వాళ్లను కాల్చి చంపినా తప్పులేదని ఆయన విమర్శించారు. యాదగిరిగుట్టలో కాంగ్రెస్కు ప్రజలు మెజార్టీ ఇచ్చారని… అయినా దొడ్డిదారిన టిఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకోవాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. వరంగల్కు చెందిన కడియం శ్రీహరితో ఎక్సఆఫిషియో ద్వారా ఓటు వేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. యాదగిరిగుట్టలో ఎమ్మెల్యె అక్రమ భూ దందా చేస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి ఆరోపించారు. తుర్కపల్లిలో కెసిఆర్ కూతురు కవిత అక్రమంగా 500 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని… ఇందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ 12 సార్లు యాదగిరిగుట్టకు వచ్చిన ఇక్కడి పేద ప్రజలకు ఏమి చేయలేదని ఆయన అన్నారు. నల్లగొండలో మున్సిపాలిటీని బిజెపి, ఎంఐఎంతో కలిసి మునిసిపల్ ఛైర్మెన్ గెలుచుకోవాలని టిఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. యాదగిరిగుట్ట సీఐ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆయన ఆరోపించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/