రేవంత్ రెడ్డితో క‌లిసి ప‌ని చేసేందుకు అభ్యంత‌రం లేదు : జగ్గారెడ్డి

భట్టి, ఉత్తమ్ సహా ఎవరూ నాతో మాట్లాడటం లేదు.. జగ్గారెడ్డి

jaggareddy

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ లో వివాదం ముదురుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పార్టీలోని కొందరు సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన అసహనాన్ని పలుమార్లు బహిరంగంగానే వెళ్లగక్కారు. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగ్గారెడ్డికి ఉన్న బాధ్యతల్లో కోత విధించారు. ఖమ్మం, వరంగల్, భువనగిరి, కరీంనగర్ లోక్ సభ స్థానాలతో పాటు మహిళా కాంగ్రెస్, ఐఎన్టీయూసీ, ఇతర సంఘాల ఇన్ఛార్జి బాధ్యతలను ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ రేవంత్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు తాజా అంశాలపై అధిష్ఠానంతో మాట్లాడేందుకు రేవంత్ ఢిల్లీకి వెళ్లారు.

ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ప్రస్తుతం తనతో భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఎవరూ మాట్లాడటం లేదని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనతో మాట్లాడేందుకు భయపడుతున్నారని అన్నారు. నిర్మొహమాటంగా నిజాలు మాట్లాడటం నా స్వభావమని అన్నారు. ‘’ఏపీ విభజన వద్దని నిజం మాట్లాడి తెలంగాణ ద్రోహిగా పేరు మోశాను. కాంగ్రస్‌పై అభిమానంతోనే ఎప్పట్నుంచో ఇదే పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్‌ పార్టీతోనే ఎవరికైనా మేలు జరుగుతుంది. సోనియాగాంధీ నియమించిన ఏ వ్యక్తితోనైనా కలిసి పనిచేసేందుకు నేను సిద్ధం. రేవంత్ రెడ్డితో క‌లిసి ప‌ని చేసేందుకు త‌న‌కు అభ్యంత‌రం లేద‌ని చాలా సార్లు చెప్పాను. ఇది కాంగ్రెస్‌ పంచాయితీ కాదు.. రేవంత్‌రెడ్డితోనే నా పంచాయితీ. మెదక్ పర్యటనకు వెళ్తే నన్ను రేవంత్‌ ఆహ్వానించలేదు. దీంతో నాకు కోపం వచ్చింది. 3సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తికి పార్టీలో విలువ ఉండదా?’’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

మరోపక్క, ఢిల్లీకి రావాలని తనకు ఇంతవరకు ఎలాంటి పిలుపు రాలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉండాలనే అనుకుంటున్నానని తెలిపారు. సోనియా, రాహుల్ నాయకత్వాన్ని తానెప్పుడూ సమర్థిస్తానని చెప్పారు. తప్పు, ఒప్పుల గురించి మాట్లాడే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఉంటుందని అన్నారు. పదవుల కోత విషయాన్ని కూడా తాను స్పోర్టివ్ గా తీసుకుంటానని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/