రాహుల్ గాంధీ నేతృత్వంలో విప‌క్ష నేత‌ల భేటీ

విప‌క్షాలు ఐక్యంగా ఉండాల‌న్న రాహుల్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విప‌క్ష నేత‌లు స‌మావేశమ‌య్యారు. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ విప‌క్ష నేత‌లు దీనికి హాజ‌ర‌య్యారు. పార్ల‌మెంటు స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహం స‌హా ప‌లు అంశాల‌పై వారు కీల‌క చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. పెగాస‌స్, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నూత‌న సాగు చ‌ట్టాలు వంటి ప‌లు అంశాల‌పై కూడా నేత‌లు చ‌ర్చిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ… విప‌క్షాలు ఐక్యంగా ఉండాల‌ని చెప్పారు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున గ‌ళాన్ని వినిపించే వారు ఎంత ఐక్యంగా ఉంటారో అంత బ‌లంగా ప్ర‌జావ్య‌తిరేక చ‌ర్య‌ల‌ను అడ్డుకోవ‌చ్చ‌ని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్ర‌భుత్వ తీరుకి వ్య‌తిరేకంగా పోరాడాల‌ని చెప్పారు. కాగా, ఈ స‌మావేశంలో కాంగ్రెస్‌తో పాటు ఎన్సీపీ, శివ‌సేన‌, ఆర్జేడీ, స‌మాజ్ వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌, టీఎంసీ, ఎల్జేడీ నేత‌లు హాజ‌ర‌య్యారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/