రేవంత్ కొత్త పార్టీ అంటూ ప్రచారం..పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు

శంకర్ అనే వ్యక్తి ప్రచారం చేసినట్టు గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు

revanth-reddy

హైదరాబాద్‌ః తెలంగాణ కాంగ్రెస్ లో కొన్నాళ్ల నుంచి వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పలువురు సీనియర్లు ఒక్కటయ్యారు. అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అధిష్ఠానం దూతగా వచ్చిన దిగ్విజయ్ సింగ్ ఇరు వర్గాలతో మాట్లాడి వెళ్లారు. ఆయన ఇచ్చే రిపోర్టు, అధిష్ఠానం తీసుకునే చర్యల గురించి అంతా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వైదొలిగి కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న పుకార్లు మొదలయ్యాయి.

రేవంత్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరును కూడా రిజిస్టర్ చేయించారంటూ పోస్టులు కనిపించాయి. దీనిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. సోషల్ మీడియాలో ఈ ప్రచారం చేసింది శంకర్ అనే వ్యక్తిగా గుర్తించింది. ఆయనపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్ కుమార్ గౌడ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రచారం చేసిన శంకర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/