రాజ్‌భవన్‌‌ ముట్టడికి పిలుపునిచ్చిన టీ కాంగ్రెస్

ఈరోజు రాజ్‌భవన్‌‌ ముట్టడికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత మూడు రోజులుగా విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల నిరసనలు చేస్తున్నారు. ఇటు తెలంగాణ వ్యాప్తంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు, ఆందోళనలు , నిరాహార దీక్షలు, మోడీ దిష్టిబొమ్మ దహనం వంటి కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నిరసనల్లో భాగంగా.. ఈరోజు చలో రాజ్‌భవన్‌ పేరుతో ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. సోమాజిగూడ నుంచి రాజ్‌భవన్‌ వరకు కాంగ్రెస్‌ నేతల ర్యాలీ చేపట్టనున్నారు.

ఉదయం 10 గంటలకు పీజేఆర్ విగ్రహం వద్దకు చేరుకోవాలని కాంగ్రెస్ నేతలకు రేవంత్ పిలుపునిచ్చారు. అక్కడి నుంచి ర్యాలీగా రాజ్‌భవన్ వరకు వెళ్లనున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు హాజరుకావాలని రేవంత్ రెడ్డి కోరారు. జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన తెలపాలని శ్రేణులకు సూచించారు. మరో వైపు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో నేతలు తెల్లవారు జామున రాజ్‌భవన్‌ను ముట్టడించారు. ఎవ్వరూ ఊహించని విధంగా ఈరోజు ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఎన్‌యూఐ నేతలు రాజ్‌భవన్‌ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేశారు. ప్రతిపక్ష నాయకులపై బీజేపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియాగాంధీ, రాహుల్‌లకు ఈడీ నోటీసులు ఇచ్చిందని ఈ సందర్భంగా వెంకట్ మండిపడ్డారు.