మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిని ప్రకటించిన టీ కాంగ్రెస్

మొత్తానికి మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలిపోయింది. మాజీ ఎంపీ దివంగత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని ఖరారు చేస్తూ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్‌ వాస్నిక్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఉప ఎన్నిక టికెట్ కోసం స్రవంతితో పాటు స్థానిక నేతలు చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్‌, కైలాష్‌ తదితరులు పోటీ పడ్డారు. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వారితో ప్రత్యేకంగా సమావేశమై అభిప్రాయాలను సేకరించారు. టికెట్‌ ఆశిస్తున్న అభ్యర్థుల బలాలు, బలహీనతలపై ఏఐసీసీకి నివేదిక పంపించారు. టీపీసీసీ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్‌ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తెగా స్రవంతి మునుగోడు ప్రజలకు సుపరిచితురాలు. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున మునుగోడు అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతి ఆ ఎన్నిక‌ల్లో ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నిక‌ల్లో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మునుగోడు టికెట్ ఆశించ‌డంతో స్రవంతి స్వచ్ఛందంగానే పోటీ నుంచి త‌ప్పుకుని ఆయన గెలుపు కోసం ప‌నిచేశారు. ఆ విధేయతే పాల్వాయి స్రవంతికి క‌లిసివ‌చ్చిన‌ట్లు స‌మాచారం. మునుగోడు టిక్కెట్ తనకే వస్తుందని పాల్వాయి స్రవంతి తొలి నుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తన తండ్రి పార్టీకి చేసిన సేవలు, మునుగోడులో తనకున్న ప్రజాదరణను పరిగణనలోకి తీసుకుని తనకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతూ వచ్చారు. అయితే మరోవైపు కృష్ణారెడ్డి సైతం టిక్కెట్ కోసం పైరవీలు చేయడంతో ఓ దశలో ఆమె అసహనానికి గురయ్యారు. టిక్కెట్ విషయమై ఓ కార్యకర్తతో తన ఆవేదనను వెళ్లబోసుకున్న ఆడియో కొద్దిరోజుల క్రితం వైరల్ అయింది. అయితే మెజార్టీ నేతల అభిప్రాయం మేరకు మునుగోడు ఉపఎన్నికలో పాల్వాయి స్రవంతికే అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది.