త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన జాతీయ పార్టీలు

న్యూఢిల్లీః త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. శనివారం ఉదయం కాంగ్రెస్, బిజెపిలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మన్ అగర్తల నుంచి బరిలో ఉండగా.. కేశవ్ సర్కార్ మజ్లిస్పురా నుంచి రంగంలో నిలిచారు. కాగా, బిజెపి 46 మందిని ప్రకటించగా.. లెఫ్ట్ ఫ్రంట్ 46 మందిని నిలుపుతున్నట్లు ప్రకటించింది. మిగతా 13 సీట్లను కాంగ్రెస్కు వదిలిపెడుతున్నట్లు ప్రకటించింది. అయితే, వారు చెప్పినదానికంటే 4 స్థానాలు ఎక్కువగా కాంగ్రెస్ పోటీ చేస్తున్నట్లు ఇవాల్టి జాబితా బట్టి తెలుస్తున్నది. త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు ఫిబ్రవరి 16 న ఒకే దశలో జరుగనున్నాయి. మార్చి 2 న కౌంటింగ్ జరుగుతుంది.
ప్రశాంత సేన్ చౌదరి (మోహన్పుర), సిస్టా మోహన్ దాస్ (బర్జాలా-ఎస్సీ), సుదీప్ రాయ్ బర్మన్ (అగర్తల), ఆశీశ్ కుమార్ సాహా (టౌన్ బోర్డోలి), గోపాల్ రాయ్ (బనమాలిపూర్), కేశవ్ సర్కార్ (మజ్లిస్పురా), రాజ్కుమార్ సర్కార్ (బధాఘాట్-ఎస్సీ), సుషాంతా చక్రవర్తి (సూర్యమణినగర్), అశోక్ దెబ్బార్మా (చార్లియాం-ఎస్టీ), అశోక్ కుమార్ బైద్య (తెల్లాంపురా), టిటాన్ పాల్ (రాధాకిషోర్పూర్), ప్రాణ్జిత్ రాయ్ (మతార్బరీ), శ్రీమతి రుబి గోప్ (కమల్పూర్), దిబా చంద్ర (కమాచారా-ఎస్టీ), సత్యబన్ దాస్ (పబిచ్చర-ఎస్సీ), బిరాజిత్ సిన్హా (కైలాశ్హరార్), చాయన్ భట్టాచార్య (ధర్మనగర్) లు కాంగ్రెస్ జాబితాలో ఉన్నారు.
మొత్తం 46 స్థానాలకు గాను సీపీఐ(ఎం) 43 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఇతర వామపక్ష భాగస్వాములైన సీపీఐ, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ ఒక్కో అభ్యర్థిని బరిలోకి దించనున్నాయని లెఫ్ట్ ఫ్రంట్ కన్వీనర్ నారాయణ్ కర్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, ఉప ప్రతిపక్ష నేత బాదల్ చౌదరి, మాజీ మంత్రులు భానులాల్ సాహా, సాహిద్ చౌదరి, తపన్ చక్రవర్తి సహా ఎనిమిది మంది సీపీఎం సిట్టింగ్ అభ్యర్థులను పక్కన పెట్టారు. జాబితాలో 24 మంది కొత్త ముఖాలు ఉన్నాయి. ఇలాఉండగా, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు 48 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బిజెపి శనివారం ప్రకటించింది. ధన్పూర్ నుంచి కేంద్ర మంత్రి ప్రతిమా భూమిక్ను బరిలోకి దింపారు. ఈ ఎన్నికల్లో బిజెపి ఒంటరిగా పోటీ చేస్తున్నదని, మొత్తం 60 స్థానాల్లో తమ అభ్యర్థులు బరిలో నిలుస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీబ్ భట్టాచార్జీ తెలిపారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః