కేరళలో రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌

ప్ర‌తిరోజు 20 వేల‌కు పైగా కేసులు
జులై 31, ఆగ‌స్టు 1 తేదీల్లో లాక్‌డౌన్

తిరువనంతపురం : కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. జులై 31, ఆగ‌స్టు 1 తేదీల్లో లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు వివ‌రించింది. క‌రోనా కేసుల తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్ పొడిగింపు లేదా పాక్షికంగా ఆంక్ష‌ల విధింపుపై మ‌ళ్లీ నిర్ణ‌యం తీసుకోనున్నారు. గత కొన్ని రోజులుగా కేర‌ళ‌లో ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందకుపైగా మ‌ర‌ణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి 20 వేలకు పైగా కేసులు న‌మోదవుతున్నాయి. దీంతో కేర‌ళ స‌ర్కారు లాక్‌డౌన్ విధించాల‌ని ఈ రోజు నిర్ణ‌యం తీసుకుంది.

మ‌రోవైపు, కేర‌ళ‌లో క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం వైద్య బృందాన్ని పంపాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. జాతీయ అంటు వ్యాధుల నియంత్ర‌ణ సంస్థ డైరెక్ట‌ర్ నేతృత్వంలోని ఆరుగురు స‌భ్యుల వైద్య‌ బృందం ఆ రాష్ట్రానికి త్వ‌ర‌లోనే చేరుకుంటుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. క‌రోనాపై పోరులో కేర‌ళ ప్ర‌భుత్వానికి ఈ బృందం స‌హాయ‌ప‌డ‌నుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/