కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు పరిహారం

కరోనా తో మరణించిన వారి కుటుంబాలకు రూ.50,000 ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) ప్రతిపాదన చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. కరోనా రోగులకు.. సేవలు అందిస్తూ వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎక్స్​గ్రేషియా సహాయం.. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి(ఎస్​డీఆర్​ఎఫ్​) నుంచి రాష్ట్రాలే చెల్లిస్తాయని స్పష్టం చేసింది. కొవిడ్​ మరణ ధ్రువీకరణపై.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్​ మార్గదర్శకాలకు అనుగుణంగా పరిహారం అందించనున్నట్లు కేంద్రం తెలిపింది.

ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. చట్టం ప్రకారం నిబంధనల ప్రకారం కరోనా బాధితుల కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం అందించేలా కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ న్యాయవాదులు రీపక్ కన్సల్, గౌరవ్ కుమార్ బన్సాల్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ‘సెక్షన్ 12 (iii) ప్రకారం, విపత్తుతో బాధపడుతున్న వ్యక్తులకు అందించే కనీస ఉపశమనం కోసం జాతీయ అథారిటీ మార్గదర్శకాలను సిఫారసు చేస్తున్నది. ఇందులో ప్రాణనష్టం జరిగినప్పుడు ఎక్స్‌గ్రేషియాతోపాటు ఇండ్లు, జీవనోపాధి పునరుద్ధరణ కోసం నష్టానికి సంబంధించిన సహాయం కూడా ఉంటుంది’ అని చట్టం చెప్తున్నదని పిటిషన్‌దారులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.