రోశయ్య ఇకలేరనే వార్త బాధాకరం : వెంకయ్య నివాళి

న్యూఢిల్లీ : మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు పూర్వ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతిపట్ల భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన పరమపదించారని తెలిసి ఎంతో విచారించానన్నారు. తెలుగు రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ అంకితభావం, నిబద్ధతతో ముందుకు సాగిన రోశయ్య ఆదర్శప్రాయులుగా నిలిచారని కొనియాడారు. ఎన్జీ రంగా శిష్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించి, ఎమ్మెల్సీగా చట్టసభల్లో అడుగుపెట్టారని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, వివిధ శాఖలకు రాష్ట్ర మంత్రిగా ప్రజాసమస్యల విషయంలో రోశయ్య నిరంతర పోరాటం చేశారని వెంకయ్యనాయుడు గుర్తుచేసుకున్నారు. ఓర్పు, నేర్పుతో తాను చేపట్టిన పదవులను సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు.

తమిళనాడు గవర్నర్‌గా హుందాగా వ్యవహరించారని పేర్కొన్నారు. రోశయ్య తనకు చిరకాల మిత్రుడని, సర్వజన హితాభిలాషి, చక్కని వక్త అని, వివిధ అంశాలపై స్పష్టమైన విషయ పరిజ్ఞానం, ప్రసంగాల్లోనూ ఎవరినీ నొప్పించకుండానే విషయాన్ని సూటిగా, స్పష్టంగా తెలియజేయటంలో సిద్ధహస్తులుగా గుర్తింపు పొందారన్నారు. 16సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత వారికి దక్కిందని, మంచి వక్తృత్వం, చక్కటి వ్యక్తిత్వంతో నిగర్విగా, నిరాడంబరంగా జీవించిన రోశయ్య ఇకలేరనే వార్త బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని వెంకయ్యనాయుడు తన సంతాప సందేశంలో తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/