కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్..
నెలమారిదంటే ముందుగా ముందుగా ఆసక్తిగా ఎదురుచూసేవారు గ్యాస్ వినియోగదారులే. గ్యాస్ ధరలు ఎంతగా పెరిగాయో..ఎంత తగ్గాయో అని తెలుసుకునేందుకు ఆసక్తి కనపరుస్తుంటారు. గత నెలలో భారీగా గ్యాస్ ధరలు పెంచిన చమురు సంస్థలు..ఈరోజు 2024 ఆర్థిక సంవత్సరం మొదటి రోజే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తూ ప్రకటన చేశాయి.
19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ను 92 రూపాయల వరకు తగ్గించాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మాత్రమే ధరలు తగ్గింపుతో కాస్త ఉపశమనం లభించింది. 14.2 కిలోల గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలు గత నెలలో ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా కొనసాగుతున్నాయి. గత నెలలో దేశీయ వంటగ్యాస్ మీద 50 రూపాయలు మేర ధరను పెంచాయి చమురు సంస్థలు. కాగా మార్చిలో ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను 350 రూపాయలు పెంచింది. ప్రస్తుతం 92 రూపాయలు తగ్గించింది. గృహ అవసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలలో తగ్గింపు లేకపోవడం సామాన్య, మధ్యతరగతి ప్రజలను నిరాశకు గురి చేసింది.
ప్రస్తుతం కొత్త ధరలతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు చూస్తే..దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 2028 రూపాయలుగా, కలకత్తాలో 2132 రూపాయలుగా, ముంబైలో 1980 రూపాయలుగా, చెన్నైలో 2192 రూపాయల 50 పైసలుగా, హైదరాబాద్లో 2,325గా నేటి నుండి కొనసాగనుంది.