మంచిర్యాల సింగరేణి బొగ్గు గనిలో 24 గంటలు గడవకముందే మరో ప్రమాదం

మంచిర్యాల జిల్లా సింగరేణి బొగ్గు గనిలో బుధువారం పెను ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన ఇంకా మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది. శ్రీరాంపూర్ ఆర్‌కే 7 గనిలో బొగ్గు తీస్తుండగా కార్మికులపై పైకప్పు కూలింది. ఈ ఘటన లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను హాస్పటల్ కు తీసుకెళ్లారు.

నిన్న శ్రీరాంపూర్ బొగ్గు గని-3లో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. కృష్ణారెడ్డి, లక్ష్మయ్య, నరసింహరాజు, చంద్రశేఖర్ అనే కార్మికులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అప్పటివరకు తమతో ఉన్న సన్నిహితులు ఒక్కసారిగా ప్రాణాలు విడువడం కార్మికులు తట్టుకోలేకపోయారు. ఇదిలా ఉండగానే ఈరోజు మరో ప్రమాదం జరగడం తో కార్మికులు వణికిపోతున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ లో కూడా ఫై కప్పు కూలడం తో ఇద్దరు కార్మికులు ప్రాణాలు విడిచారు. పైకప్పు గురించి అధికారులకు సమాచారం అందించినా సరైన చర్యలు తీసుకోవడం లేదని.. ఆ కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.