తెలంగాణలో కోకాకోలా బేవరేజస్ సంస్థ పెట్టుబడులు : మంత్రి కేటీఆర్
సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్లో కొత్తగా పెట్టుబడులు
హైదరాబాద్: హిందుస్థాన్ కోకాకోలా బేవరేజస్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో నేడు నాలుగు ఒప్పందాలనుకు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కోకాకోల సంస్థ 25 ఏళ్లుగా సేవలందిస్తోందని కేటీఆర్ చెప్పారు. తాజాగా సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్లో రూ.600 కోట్ల పెట్టుబడులు పెట్టిందని గుర్తు చేశారు.
అక్కడ 48.53 ఎకరాల స్థలాన్ని ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిందని కేటీఆర్ తెలిపారు. అక్కడ ఏర్పాటు కాబోయే కొత్త పరిశ్రమ ద్వారా దాదాపు 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. అంతేగాక, కోకాకోలా కంపెనీ భవిష్యత్లో మరో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని వివరించారు. ఆ సంస్థలో మహిళలకు 50 శాతానికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని కేటీఆర్ తెలిపారు. కంపెనీ స్థానికంగా దొరికే వనరులను వాడుకోవాలని ఆయన సూచించారు. పర్యావరణహితమైన వస్తువులను వినియోగించాలని సంస్థను కోరారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/